కేకేఆర్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడికి కరోనా

1 Apr, 2021 18:22 IST|Sakshi

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌)‌‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీష్ రాణాకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాణా.. రెండు రోజుల కిందట గోవా ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రిపోర్ట్ చేసే సమయంలో అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఓ ప్రైవేటు హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉంటున్నాడు. అయితే అతనికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. 

కాగా, కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. గత నాలుగు ఐపీఎల్ సీజన్‌లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్న రాణా.. దాదాపు ప్రతి సీజన్‌లో 300కుపైగా పరుగులు చేశాడు. యూఏఈలో జరిగిన గత ఐపీఎల్ సీజన్‌లో అతను 138.58 స్ట్రయిక్‌ రేట్‌తో 352 పరుగులు చేశాడు. రాణా తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 60 మ్యాచ్‌ల్లో 135.56 స్ట్రయిక్‌ రేట్‌తో 1437 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: 2017లో పూణే ఫైనల్‌ చేరడానికి ధోనినే కారణం..స్మిత్‌ కాదు

>
మరిన్ని వార్తలు