IPL 2021: ఇదేం నో బాల్‌ సైరన్‌.. క్రికెటర్ల అసహనం!

22 Apr, 2021 00:50 IST|Sakshi

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగింది. మొత్తం ఈ మ్యాచ్‌లో 26 సిక్సర్లు రావడం ఫ్యాన్స్‌కు మంచి మజాను అందించింది. కానీ ఒకానొక సందర్భంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రవీంద్ర జడేజా వేసిన 11 ఓవర్‌ ఆఖరి బంతిని రసెల్‌కు వేశాడు. ఆ ఓవర్‌ను చాలా కుదరుగా వేసిన జడేజా రసెల్‌ దూకుడును కాస్త కట్టడి చేశాడు. ఓ‍కే.. మంచి ఓవర్‌ అనుకున్నారు సీఎస్‌కే అభిమానులు. జడేజా ఫీల్డింగ్‌ పొజిషన్‌కు వెళ్లిపోయాడు.  కీపర్‌ ధోని కూడా బ్యాట్స్‌మన్‌  స్టైకింగ్‌ చేసే ఎండ్‌లోకి వచ్చేశాడు.

ఇక బౌలర్‌ కూడా ఓవర్‌ను వేయడానికి దాదాపు సిద్ధమై పోయాడు., కానీ అప్పుడు మోగింది నో బాల్‌ సైరన్‌. దాంతో ఇక క్రికెటర్లకు ఏమీ అర్థం కాలేదు. ఇంత ఆలస్యంగా నోబాల్‌ సైరన్‌ ఏమిటి అనే అసహనం వారిలో కనిపించింది. మళ్లీ స్టైకింగ్‌ ఎండ్‌ మారిపోయింది. కీపర్‌ ధోని కూడా మళ్లీ అటువైపు నడిచాడు. ఫీల్డర్లు పొజిషన్‌ కూడా మళ్లీ చేంజ్‌ కాక తప్పలేదు. ఆ బంతి ఫ్రీ హిట్‌ కావడంతో దాన్ని రసెల్‌ సిక్స్‌గా మలిచాడు. 

సాధారణంగా ఓవర్‌ చివరి బంతి నో బాల్‌ అయితే ఒక బౌలర్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌కు వెళ్లకముందే నో బాల్‌ సిగ్నల్‌ రావాలి. కానీ చాలా ఆలస్యమైంది.  నో బాల్‌ అంపైర్‌ చూడటానికి, అది కన్ఫామ్‌ చేసుకోవడానికి టైమ్‌ పట్టి ఉండివచ్చు. కానీ ఇలా మొత్తం ఛేంజ్‌ అయిన తర్వాత నో బాల్‌ సైరన్‌ మోగడం అంతా అసహనానికి లోను కావాల్సి వచ్చింది. నో బాల్‌ సిగ్నల్‌ను థర్డ్‌ అంపైర్‌కు అప్పచెప్పడంతో అది ఆలస్యం అవుతుంది. గతంలో బౌలర్‌ వేసే లైన్‌ క్రాస్‌ నో బాల్‌ ఫీల్డ్‌ అంపైర్ల చేతిలో ఉంటుంది.  ప్రత్యేకంగా నో బాల్‌ అంపైర్‌ అని వారికి అప్పచెప్పారో అప్పట్నుంచీ  అది ఆలస్యం కావడం తరచు జరుగుతోంది. 

నో బాల్‌ వివాదాలు..
ఐపీఎల్‌–2019లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్‌’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్‌’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్‌ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్‌ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్‌లో తొలిసారి ‘నోబాల్‌ అంపైర్‌’ అంటూ ప్రత్యేకంగా నియమించారు.   ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్, రిజర్వ్‌ అంపైర్‌లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్‌ పని.  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నో బాల్‌ అంపైర్‌ అంశం ఇలా ఆలస్యం కావడంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

చదవండి: CSK Vs KKR: కమిన్స్‌ మెరుపులు వృథా

మరిన్ని వార్తలు