జడేజాతో జాగ్రత్త ఉండాలనే ఆలోచిస్తా:  డుప్లెసిస్‌

26 Apr, 2021 14:21 IST|Sakshi

అది గాలివాటం కాదు.. ప్రాక్టీస్‌లో దుమ్ములేపుతున్నాడు

ముంబై:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టి బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. జడేజా ఈ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే 191 పరుగులు బోర్డుపై ఉంచకల్గింది. కాగా, మ్యాచ్‌ తర్వాత జడేజా ఇన్నింగ్స్‌పై సహచర ఆటగాడు డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ తమకు అనుకూలంగా మారిపోయిందన్నాడు.

‘అది జడేజా నుంచి మేము ఊహించిందే అది అసాధారణ ఇన్నింగ్స్‌.  ఈ సీజన్‌లో జడేజా చాలా బాగా ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్‌ బాగా మెరుగుపడింది. చివరి ఓవర్‌లో జడేజా కొట్టిన షాట్లు గాలివాటం కాదు.  ప్రాక్టీస్‌ సెషన్‌లో జడేజా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. చాలా సిక్సర్లు కొడుతున్నాడు. అదే ఇక్కడ ఉపయోగపడింది. జడేజా ఆడిన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ మా వైపు మలుపు తిరిగింది. మేము 160-165 స్కోరు చేస్తామనకున్నాం. ఈ స్లో వికెట్‌పై మేము నమోదు చేసిన స్కోరు ఎక్కువే’ అని తెలిపాడు. 

తమ దేశ ​క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా.. టీమిండియాతో ఆడుతున్నప్పుడు కూడా జడేజా గురించి ఆలోచిస్తామని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. భారత్‌ జట్టులో జడేజా అత్యంత ప్రమాదకరమైన ఫీల్డర్‌ అనే విషయాన్ని భారత్‌తో మ్యాచ్‌లు ఉన్న ప్రతీ సందర్భంలోనూ గుర్తుంచుకుంటా. జడేజా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచిస్తా. మా జట్టు కూడా జడేజాను సీరియస్‌గా తీసుకుంటుంది.

ప్రధానంగా బౌండరీ దగ్గరగా బంతిని కొట్టి రెండు పరుగులు కోసం యత్నించేటప్పుడు అక్కడ జడేజా ఉంటే కాస్తా ఆలోచిస్తాం. అతను బంతిని అందుకున్న రెప్పపాటు వ్యవధిలో సరిగ్గా వికెట్ల దగ్గరికి బంతిని విసురుతాడు. అది మాకు ఒక మిరాకిల్‌ అనిపిస్తూ ఉంటుంది’ అని డుప్లెసిస్‌ తెలిపాడు. 

ఇక్కడ చదవండి: IPL 2021 CSKvsRCB: అంతటా తానే.. అన్నింటా అతడే

>
మరిన్ని వార్తలు