ఒక్క ఓవర్‌ పొదుపుగా బౌల్‌ చేయాల్సింది.. కేకేఆర్‌ ఓటమికి నేనే కారణం

22 Apr, 2021 21:01 IST|Sakshi

ముంబై: కేకేఆర్‌, చెన్నై జట్ల మధ్య బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నైదే పైచేయి అయినప్పటికీ.. కేకేఆర్‌ తమ అద్భుత పోరాట పటిమతో అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను దాదాపు గెలిపించినంత పని చేసిన కమిన్స్‌.. మ్యాచ్‌ అనంతరం డ్రెసింగ్‌ రూమ్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయగా కొద్ది నిమిషాల్లోనే దావణంలా వ్యాపించింది. ఈ వీడియోలో మ్యాచ్‌ను గెలిపించలేనందుకు బాధగా ఉందన్న కమిన్స్‌.. ఓటమికి తనే బాధ్యుడ్నని చెప్పడం అభిమానులను తెగ ఇంప్రెస్‌ చేసింది.

A post shared by Kolkata Knight Riders (@kkriders)

వ్యక్తిగతంగా తన బ్యాటింగ్‌ సంతృప్తినిచ్చినా, బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్‌పై ప్రభావం పడేలా చేసిందని కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాను ఒక్క ఓవర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసుంటే, మ్యాచ్‌ను మేమే గెలిచేవాళ్లం అని ఆయన చెప్పిన మాటలకు క్రికెట్‌ లవర్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. తన ప్రయత్నం తాను చేసి కూడా ఓటమికి తననే బాధ్యుడ్ని చేసుకోవడం అతని క్రీడా స్పూర్తికి నిదర్శనమని ఫ్యాన్స్‌ అతన్ని కొనియాడుతున్నారు. అంతేకాదు మ్యాచ్‌ అంత క్లోజ్‌గా వెల్లడానికి రసెల్‌ విధ్వంసమే కారణమని అతను చెప్పడాన్ని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్ధేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా, ఏమాత్రం వెరవకుండా ఎదురుదాడికి దిగి ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన కేకేఆర్‌.. పొట్టి క్రికెట్‌లోని అసలుసిసలైన మజాను అభిమానులను అందించింది. ముఖ్యంగా లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్లు రసెల్‌(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్‌ కార్తిక్‌(24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కమిన్స్‌(34 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అద్వితీయ పోరాటం క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. మ్యాచ్‌పై అశలు వదులుకున్న సమయంలో ఈ లోయరార్డర్‌ త్రయం భీకరమైన పోరాటం చేసి, నిస్సహాయ స్థితిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: నేను, నా ఇద్దరు పిల్లలు.. వైరలవుతున్న రోహిత్‌ భార్య రితిక సెల్ఫీ

మరిన్ని వార్తలు