ఏబీ.. నీకు హ్యాట్సాఫ్‌: కోహ్లి

28 Apr, 2021 07:24 IST|Sakshi
Photo Courtesy: BCCI

మ్యాచ్‌ పోయిందనే అనుకున్నా

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో గెలవడంపై ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ మళ్లీ తమ చేతుల్లోకి రావడానికి సిరాజ్‌ ఆఖరి ఓవర్‌ కారణమన్నాడు. చివర్లో ఒక ప్రొఫెషనల్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్న సిరాజ్‌.. విజయాన్ని అందించాడన్నాడు. తాము చేసిన ఫీల్డింగ్‌ తప్పిదాలతోనే మ్యాచ్‌ ఇంత దూరం వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లి చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. ‘ మేము బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. కానీ ఏబీ డివిలియర్స్‌ ఆఖరి కొన్ని ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించడంతో మళ్లీ రేసులోకి వచ్చాం. 

ఇక మేము బౌలింగ్‌ చేసేటప్పుడు హెట్‌మెయిర్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో మ్యాచ్‌ కోల్పోతున్నాం అనిపించింది. హెట్‌మెయిర్‌ ఇన్నింగ్స్‌ తప్పితే మిగతా అంతా మేము కంట్రోల్‌గానే బౌలింగ్‌ చేశాం. మేము పొడి బంతితో బౌలింగ్‌ చేశాం. డ్యూ లేదు. బంతి పొడిగా ఉండటానికి ఇసుక ఉండటమే కారణం. ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మ్యాక్స్‌వెల్‌ ఇంకా బౌలింగ్‌ చేయడం లేదు. మ్యాక్సీ మాకు 7వ ఆప్షన్‌. మాకు చాలా బౌలింగ్‌ వనరులు ఉండటంతో మ్యాక్సీకి బౌలింగ్‌ ఇవ్వడం లేదు. మా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా చివరి వరకూ బలంగానే ఉంది. ఏబీ సుమారు ఐదు నెలల నుంచి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడటం లేదు. కానీ అతని బ్యాటింగ్‌ చూస్తుంటే అంత కాలం నుంచి క్రికెట్‌ ఆడుకుండా ఉన్నట్టు లేదు. ఏబీకి హ్యాట్పాఫ్‌. పదే పదే బ్యాటింగ్‌లో మెరుస్తూ జట్టుకు ఒక ఆస్తిలా మారిపోయాడు’ అని తెలిపాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి ఒక్క పరుగు తేడాతో ఆర్‌సీబీని గెలిపించాడు. ఢిల్లీ బ్యాటింగ్‌లో పంత్‌ 58 నాటౌట్‌, హెట్‌మైర్‌ 53 నాటౌట్‌ రాణించినా గెలిపించలేకపోయారు. అంతకుముందు ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు.  

బెంగళూరును ఎప్పటిలాగే మరోసారి డివిలియర్స్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన అతను ఆ తర్వాత చెలరేగాడు. అక్షర్, రబడ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టిన అతను, చివరి ఓవర్లో పండగ చేసుకున్నాడు. స్టొయినిస్‌ పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ఈ ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్, షార్ట్‌ ఫైన్‌లెగ్, కవర్స్‌ దిశగా డివిలియర్స్‌ మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆఖరి ఓవర్లో మొత్తం 23 పరుగులు రావడంతో చాలెంజర్స్‌ మెరుగైన స్కోరు చేయగలిగింది.

మరిన్ని వార్తలు