ఐపీఎల్‌లో కొత్త రూల్‌.. బ్యాట్స్‌మెన్లకు ఫంక్షన్‌, బౌలర్లకు టెన్షన్‌

9 Aug, 2021 12:52 IST|Sakshi

ముంబై: కరోనా‌ కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ వేదికగా లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్‌ హాఫ్‌ జరగనుంది. అయితే ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్‌ కోసం సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్స్‌లోకి బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి  తెచ్చింది. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు తాకే అవకాశం ఉన్నందున, తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేస్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్‌ బ్యాట్స్‌మెన్లకు ఫంక్షన్‌, బౌలర్లకు టెన్షన్‌ అన్న చందంగా మారింది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్ల‌కు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు