వారిద్దరు సూపర్‌..  పరిస్థితులకు తగ్గట్టు ఆడారు 

24 Apr, 2021 17:53 IST|Sakshi

చెన్నై: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను రాహుల్‌ (60*), గేల్‌(43*) గెలిపించి హాట్రిక్‌ ఓటముల నుంచి కాస్త ఉపశమనం పొందారు. కాగా పంజాబ్‌ ఆటతీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రగ్యాన్‌ ఓజా ప్రసంశలు కురిపించాడు.

''ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో వారి సహజమైన ఆటతీరు కనిపించలేదు. పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకొని ఇన్నింగ్స్‌ను నడిపించిన రాహుల్‌, గేల్‌లు కడవరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. వాస్తవానికి ఇద్దరు దూకుడుగా ఆడేవాళ్లే.. కానీ అక్కడి పరిస్థితిని అర్థం చేసుకొని ఆడారు.. తమకోసం కాకుండా టీంను గెలిపించాలనేదానిపై ప్రతీ ఆటగాడు దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. గేల్‌ ఆటతీరు కూడా నాకు కొత్తగా అనిపించింది. వస్తూనే బాదుడే లక్ష్యంగా పెట్టుకొని నిర్లక్ష్యంగా వికెట్‌ ఇచ్చుకునే గేల్‌ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం పరిణితితో ఆడాడు. కానీ ఒకసారి కుదురుకున్నాక తన మార్క్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతను చేసిన 43 పరుగుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించకుండా కనిపిస్తున్న చెన్నై పిచ్‌పై  ఓపికగా ఆడితే పరుగులు వస్తాయనేది మరోసారి నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.


తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి సూర్య కుమార్‌ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) సహకారం అందించాడు. పంజాబ్‌ బౌలర్లు రవి బిష్ణోయ్‌ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. 
చదవండి: ‘పిచ్‌లు తయారుచేసే టైమ్‌ లేదు.. ఇది బాధాకరం’

మరిన్ని వార్తలు