పృథ్వీ షాకు పూనకం.. తల పట్టుకున్న శివమ్‌ మావి

29 Apr, 2021 22:28 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షాకు పూనకం వచ్చిందా అన్న రీతిలో రెచ్చిపోయాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. శివమ్‌ మావి వేసిన మొదటి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాది విధ్వంసం సృష్టించాడు.ఈ ఓవర్లో వైడ్‌ సహా మొత్తం 25 పరుగులు వచ్చాయి.ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన రెండో ఆటగాడిగా పృథ్వీ నిలిచాడు.అంతకముందు ఐపీఎల్‌లోనే అజింక్యా రహానే రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఈ ఫీట్‌ను సాధించాడు. 

పృథ్వీ షా దెబ్బకు శివమ్‌ మావి ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు ఇచ్చిన జాబితాలో చేరిపోయాడు. 25 పరుగులిచ్చిన మావి మూడో స్థానంలో ఉండగా.. అబు నెచిమ్‌ 27 పరుగులతో తొలి స్థానంలో.. హర్భజన్‌ 26 పరుగులతో రెండు.. వరుణ్‌ ఆరోన్‌ 23 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.  దీంతో పాటు పృథ్వీ షా (18 బంతుల్లో 50) హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకొని ఢిల్లీ తరపున తక్కువ బంతుల్లో ఫిప్టీ సాధించి పంత్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో మోరిస్‌(17 బంతులు) ఉన్నాడు.​   ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది.  8 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 81/0 గా ఉంది.పృథ్వీ షా 54, ధావన్‌ 25 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.
చదవండి: పృథ్వీ షా అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌లను దాటేశాడు

మరిన్ని వార్తలు