ప్యూమాతో ఒప్పందం కుదుర్చుకున్న యువ క్రికెటర్లు

20 Apr, 2021 17:28 IST|Sakshi

ముంబై: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని క్రికెట్‌ ఫార్మాట్లలో విశేషంగా రాణించిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌లు బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. ప్ర‌ముఖ జ‌ర్మ‌న్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా.. ఈ యువ క్రికెట‌ర్లతో దీర్ఘ‌కాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ మంగ‌ళ‌వారం అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్యూమా ఇదివరకే టీమిండియా స్టార్‌​ క్రికెటర్లను తమ సంస్థ ప్రచారకర్తలుగా నియమించుకుంది. భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, యువ‌రాజ్‌సింగ్‌ లాంటి స్టార్ క్రికెట‌ర్ల‌తో పాటు మ‌హిళా క్రికెట‌ర్ సుష్మా వ‌ర్మ‌తో ప్యూమా ఒప్పందం కుదుర్చుకుంది.

'ప్యూమా ఫ‌రెవ‌ర్ ఫాస్ట‌ర్ స్పిరిట్' అనే నినాదానికి ఈ ఇద్ద‌రు యువ ఆటగాళ్లు స‌రిగ్గా స‌రిపోతార‌ని, అందుకే వారిని ఎంపిక చేసుకున్నట్లు ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ వెల్లడించారు. స్టార్‌ ఆటగాళ్లనే కాకుండా యువ క్రికెటర్లను కూడా ప్రోత్స‌హించాల‌నే ఉద్ధేశంతో ఈ ఇద్దరు క్రికెటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయ‌న తెలిపారు. ప్యూమాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఈ ఇద్దరు క్రికెటర్లు స్పందించారు. ప్యూమా లాంటి సంస్థతో డీల్‌ కుదుర్చుకోవడం తమ అదృష్టమని, ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల సరసన చేరడం నిజంగా గొప్ప అనుభూతి అని ఇద్దరు క్రికెటర్లు తెలిపారు.   

కాగా, గ‌తేడాది ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణించిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. ఆతరువాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరస్‌లోనూ ఆకట్టుకున్నాడు. సుందర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు గత ఐపీఎల్‌ సీజన్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన పడిక్కల్‌.. ఈ ఏడాది జరిగిన దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో పరుగుల వరద పారించాడు. ప్యూమా ఎంచుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లే కావడం విశేషం. 
చదవండి: సీఎస్‌కే అసలుసిసలైన ఆల్‌రౌండర్‌ అతనే..

మరిన్ని వార్తలు