ఒక్క వికెట్‌ తీస్తే అరుదైన క్లబ్‌లోకి అశ్విన్‌

15 Apr, 2021 18:04 IST|Sakshi

ముంబై: ఫార్మాట్లకతీతంగా గత కొంత కాలంగా విశేషంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 249 వికెట్లు పడగొట్టిన అతను.. మరో వికెట్‌ తీస్తే అరుదైన 250 వికెట్ల క్లబ్‌లోకి చేరతాడు. అంతర్జాతీయ టీ20ల్లో 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు, ఐపీఎల్‌లో 155 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు, ఇతర టీ20ల్లో 58 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. మొత్తంగా 249 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 4/8, ఐపీఎల్‌లో 4/34 అశ్విన్‌ అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 34 ఏళ్ల అశ్విన్‌..  ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా అమిత్‌ మిశ్రా(160), పియూశ్‌ చావ్లా(156), డ్వేన్‌ బ్రావో(154), హర్భజన్‌సింగ్‌(150) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌ 2021లో భాగంగా గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అశ్విన్‌ 250 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.
చదవండి: టీమిండియా కెప్టెన్‌కు అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు