IPL 2021: మరో స్టార్‌ ఆటగాడికి కరోనా

7 Apr, 2021 11:18 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను కరోనా వైరస్‌ ఇప్పట్లో వదిలేలా లేదు. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు, సిబ్భంది వరుసగా కరోనా బారిన పడుతూ వస్తున్నారు. తాజాగా ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ఆర్‌సీబీ తన ట్విటర్‌లో తెలిపింది.

''ఏప్రిల్‌ 3న నిర్వహించిన కోవిడ్‌ పరీక్షలో సామ్స్‌కు నెగిటివ్‌ వచ్చింది. అయితే ఈరోజు చేసిన పరీక్షల్లో అతనికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో చెన్నైలోని హోటల్‌ రూంలోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. సామ్స్‌కు కరోనా నిర్థారణ కావడంతో జట్టులోని మిగతా ఆటగాళ్లకు మరోసారి కోవిడ్‌ టెస్టు చేయనున్నట్లు'' ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.  

కాగా ఇప్పటికే ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా సామ్స్‌ కరోనా బారిన పడడంతో ఆర్‌సీబీలో కలవరం మొదలైంది.  కాగా ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఇక కేకేఆర్‌ నుంచి నితీష్‌ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి అక్షర్‌ పటేల్‌ సహా ఇతర ఆటగాళ్లు కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: ఆటగాడికి కరోనా.. ఆర్‌సీబీలో కలవరం

మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగ.. ఆర్‌సీబీకి భారీ మూల్యం

>
మరిన్ని వార్తలు