ఢిల్లీ ఓటమి: పంత్‌ మిస్టేక్‌ వెరీ క్లియర్‌..!

16 Apr, 2021 07:11 IST|Sakshi
Photo Coutesy:BCCI/IPL

ముంబై: ‘మేము ఆరంభంలో బాగా బౌలింగ్‌ చేశాం. కానీ చివరి వరకూ దాన్ని కొనసాగించలేకపోయాం. ఇంకా మెరుగ్గా చేయాల్సి ఉంది. ఇలా జరగడం మ్యాచ్‌లో భాగమే. మ్యాచ్‌ చివర్లో డ్యూ ఫ్యాక్టర్‌ కీలక పాత్ర పోషించింది. మేము 15-20 పరుగులు చేస్తే మ్యాచ్‌పై ఆశలుండేవి. రెండో ఇన్నింగ్స్‌ డ్యూ ఫాక్టర్‌ వల్ల స్లో బంతుల్ని ఆపడం కష్టమైంది’ ఇది మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చెప్పిన మాటలు. ఇది నిజమే. బౌలర్లకు బంతిపై గ్రిప్‌ దొరక్కపోవడంతో బంతుల దశ మారింది. అది రాజస్థాన్‌కు కలిసొచ్చింది. మరి ఇక్కడ రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్‌గా పంత్‌ కెప్టెన్సీ బాగానే ఉంది. కానీ పంత్‌ చేసిన తప్పిదాలు కూడా కనిపించాయి. 

లో స్కోరింగ్‌ మ్యాచ్‌ల్లో పొదుపు బౌలింగ్‌ చేయడం ముఖ్యం. అది ఆరంభంలో ఢిల్లీ చేసింది. కానీ మ్యాచ్‌ గడుస్తున్న కొద్దీ పట్టుకోల్పోయింది ఢిల్లీ. ప్రధానంగా డేవిడ్‌ మిల్లర్ ‌(62; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆట తీరుతో రాజస్థాన్‌లో ఆశలు చిగురించాయి. స్టోయినిస్‌ వేసిన 13 ఓవర్‌లో మిల్లర్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టి మంచి ఊపు తీసుకొచ్చాడు. మళ్లీ అవీష్‌ ఖాన్‌ వేసిన 16 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో రాజస్థాన్‌ వంద పరుగుల స్కోరును దాటింది. లెగ్‌పై రెండు లెంగ్త్‌ బాల్స్‌ను మిల్లర్‌ ఈజీగా సిక్స్‌లుగా మలిచాడు.  ఆ రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత అవీష్‌ ఖాన్‌ వద్దకు వచ్చిన పంత్‌.. రైట్‌ స్లాట్‌లో బంతి వేయమని చెప్పాడు. అది ఫలితాన్ని ఇచ్చింది. ఆ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌ కొడదామనుకున్న మిల్లర్‌..లాంగాన్‌లో దొరికేశాడు. 

ఇక్కడ పంత్‌ వ్యూహం పని చేసినట్లే కనిపించింది. కానీ పంత్‌ ‌చేసిన ఒక మిస్టేక్‌ అయితే వెరీ క్లియర్‌గా కనబడింది. మ్యాచ్‌లో 11 ఓవర్‌ తర్వాత ఒక్క ఓవర్‌ను కూడా రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇవ్వలేదు. అప్పటికే పేసర్లను మీడియం ఫాస్ట్‌ బౌలర్లను మిల్లర్‌ ఉతికి ఆరేయగా, రాహుల్‌ తెవాతియా కూడా రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ తెవాతియా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. రాహుల్‌ తెవాతియా ఉన్నప్పుడు అశ్విన్‌కు బౌలింగ్‌ ఇచ్చే సాహసం చేయలేదు. కానీ తెవాతియా- మిల్లర్‌లు ఔటైన తర్వాత కూడా అశ్విన్‌కు ఓవర్‌ మిగిలి ఉన్నా ఇవ్వలేదు. అశ్విన్‌ మూడు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చాడు. స్టోయినిస్‌, వోక్స్‌, టామ్‌ కరాన్‌, రబడా చేతే బౌలింగ్‌ చేయించాడు కానీ అశ్విన్‌కు మాత్రం ఓవర్‌ ఇవ్వలేదు.

ఢిల్లీ బౌలర్లలో అశ్విన్‌ ఎకానమీనే తక్కువ. కేవలం 4.70 ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు అశ్విన్‌. మరి ఇక్కడే పంత్‌ మిస్టేక్‌ చాలా క్లియర్‌గా కనబడింది. మోరిస్‌ బ్యాటింగ్‌కు వచ్చిన క్రమంలో, అందులోనూ ఫాస్ట్‌ బౌలర్లను అప్పటికే ఈజీగా ఆడిన మిల్లర్‌ను దృష్టిలో పెట్టుకుని అశ్విన్‌ చేత మధ్యలో ఓవర్‌ను వేయించాల్సి ఉంటే బాగుండేది. ఇది డగౌట్‌లో ఉన్న హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా మింగుడు పడని అంశం. మ్యాచ్‌ ఢిల్లీ వైపు ఉన్నప్పుడు ఒక బెస్ట్‌ బౌలర్‌ చేత బౌలింగ్‌ ఎందుకు చేయించలేదో పాంటింగ్‌కు కూడా అర్థం కాలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇదే విషయంపై పంత్‌ను పాంటింగ్‌ ప్రశ్నించక మానడు. 

ఇక్కడ చదవండి: RCB VS SRH‌: అరిచి అరిచి నా గొంతు పోయింది
మోరిస్‌ మ్యాజిక్‌.. రాజస్థాన్‌ గ్రాండ్‌ విక్టరీ

మరిన్ని వార్తలు