ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగిసిన మరుసటి రోజే ఐపీఎల్‌ జట్టులో చేరిక

29 Mar, 2021 17:29 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన మరుసటి రోజే ముంబై ఇండియన్స్‌ శిబిరంలో ప్రత్యక్షమాయ్యడు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌. మరో పది రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో జట్టుతో పాటు శిక్షణా శిబిరంలో చేరాలని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఆదేశాలు జారీ చేయటంతో జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా ముంబైకి చేరుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన గంటల వ్యవధిలోనే పాండ్యా సోదరులు(హార్దిక్‌, కృనాల్‌), సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్‌ కిషన్‌లు ముంబై ఇండియ‌న్స్ జట్టుతో చేరగా, తాజాగా రోహిత్‌ కూడా వీరితో పాటు ముంబై శిబిరంలో చేరిపోయాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లందరూ స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో క్వారంటైన్‌ అంక్షల నడుమ బస చేస్తున్నారు. 

సోమవారం జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హోటల్‌లో అడుగుపెట్టగానే ఆటగాళ్లతోపాటు మేనేజ్‌మెంట్‌ సభ్యులు అతనికి ఘన స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి పాండ్యా సోదరులు, సూర్య‌కుమార్, ఇషాన్‌ కిషన్‌లు జట్టుతో చేరిన వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన ముంబై ఇండియ‌న్స్ యాజమాన్యం..  తాజాగా రోహిత్‌కు వెల్‌కమ్‌ చెబుతున్న వీడియోను సైతం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇదిలా ఉండగా చెన్నై వేదికగా ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టును ఢీకొంటుంది. 

మరిన్ని వార్తలు