రోహిత్‌ సారధ్యంలో ముంబై ఆరో టైటిల్‌ సాధిస్తుంది: రాహుల్‌ చాహర్‌

7 Apr, 2021 17:31 IST|Sakshi

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు టైటిళ్లు ఎగురేసుకుపోయిన ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ సారధ్యంలో ఆ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తూ, టైటిల్‌ ఫేవరేట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన 'ఆరే'యడం ఖాయమని ఆ జట్టు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ జోస్యం చెప్పాడు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై జట్టు అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్న అతను, ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌ తరఫున మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. జహీర్ ఖాన్‌, జయవర్దనే లాంటి దిగ్గజాల ఆధ్వర్యంలో సాధన చేయడం తమకు కలిసొస్తుందని, వీరి శిక్షణలో జట్టు సభ్యులు మరింత రాటుదేలారని తెలిపాడు. టీమిండియా స్టార్‌ క్రికెటర్లతో జట్టు దుర్భేద్యంగా ఉందని, దీనికి విదేశీ క్రికెటర్ల బలం తోడైతే తమ జట్టుకు తిరుగే ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్‌ సారధ్యంలో ముంబై జట్టు వరుసగా మూడో టైటిల్‌ను, మొత్తంగా ఆరో టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. చివరి రెండు సీజన్లలో ముంబై టైటిల్ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన రాహుల్ చహర్‌.. దుబాయ్‌ వేదికగా జరిగిన గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిని అతను 7.46 ఎకానమీతో 30 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉండగా, చెన్నై వేదికగా ఏప్రిల్‌ 9న జరుగనున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
చదవండి: మ్యాక్సీ రివర్స్‌ స్వీప్‌ అదుర్స్‌..

>
మరిన్ని వార్తలు