ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్‌ భావోద్వేగం

13 Apr, 2021 08:58 IST|Sakshi
ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ/ఆర్‌ఆర్‌ ట్విటర్‌)

ముంబై: ఐపీఎల్‌-2021లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌- పంజాబ్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ పొట్టి ఫార్మాట్‌లోని అసలైన మజాను పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కాగా అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్  బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ దగ్గర దీపక్‌ హుడా చేతికి చిక్కడంతో ఆ జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. దీంతో సంజూ సెంచరీ వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన అతడు.. ‘‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. లక్ష్యానికి అత్యంత చేరువగా వెళ్లాం.

కానీ దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదు. ఇంతకంటే నేను ఏం చేయగలను. ఆటలో ఇవన్నీ సహజమే. వికెట్‌ మెరుగు పడుతుంది.. టార్గెట్‌ను సులభంగా ఛేదించగలమని అనుకున్నాం. ఓటమి పాలైనా, జట్టు బాగానే ఆడిందన్న తృప్తి మిగిలింది’’అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో చిరస్మరణీయ సెంచరీ సాధించినందుకు గానూ సంజూ సామ్సన్‌ను ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ వరించింది. ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘ఇన్నింగ్స్‌ ద్వితీయార్థం అత్యద్భుతంగా సాగింది. ఆచితూచి ఆడుతూనే సింగిల్స్‌ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొట్టాను. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను.

నా నైపుణ్యాలను చక్కగా వినియోగించుకున్నపుడు కచ్చితంగా ఇలాంటి ప్రదర్శన ఇవ్వగలనని తెలుసు. ఈ క్రమంలో ఒక్కోసారి వికెట్‌ కోల్పోతాను కూడా. ఈ నాటి మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ సంతృప్తికరంగా సాగింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా 63 బంతుల్లో 119(12 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసిన సంజూ.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడా చేతికి క్యాచ్‌ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడటమే గాకుండా గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ఓటమి తప్పలేదు.

స్కోరు: పంజాబ్‌ కింగ్స్‌- 221/6 (20)
ఆర్‌ఆర్‌ 217/7 (20)

చదవండి: సంజూ ఔట్‌... పంజాబ్‌ విన్‌
అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు!

మరిన్ని వార్తలు