IPL 2021: ప్లేఆఫ్‌ చేరాక ముంబై బుమ్రాకు రెస్ట్‌ ఇస్తుందా?

16 Sep, 2021 13:33 IST|Sakshi
జస్‌ప్రీత్‌ బుమ్రా( Photo: IPL/BCCI)

Saba Karim Comments On IPL 2021: క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందించేందుకు రెండు మెగా ఈవెంట్లు సిద్ధంగా ఉన్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో అంచె ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక క్యాష్‌ రిచ్‌లీగ్‌ ముగిసిన రెండు రోజులకే అంటే అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ మొదలుకానుంది.

ఈ క్రమంలో మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ వంటి పలువురు విదేశీ స్టార్లు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి టీమిండియా ఆటగాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఫ్రాంఛైజీలు.. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశమే లేదని పేర్కొన్నాడు.

ఖేల్‌నీతి అనే యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒక్కసారి ఆలోచించండి. ప్లే ఆఫ్‌నకు చేరుకున్న తర్వాత ముంబై ఇండియన్స్‌ బుమ్రాను పక్కనపెడుతుందా? విశ్రాంతి కల్పిస్తుందా? అస్సలు అలా చేయదు. ముంబై అనే కాదు..ఢిల్లీ, ఆర్సీబీ.. ఏ జట్టైనా అలా చేయడానికి ఇష్టపడదు. టైటిల్‌ నెగ్గడమే ఫ్రాంఛైజీల లక్ష్యం. కాబట్టి టీ20 ప్రపంచకప్‌ కోసం ఆటగాళ్లకు రెస్ట్‌ ఇచ్చే పరిస్థితి ఉండదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులోని టీమిండియా ఆటగాళ్లలో దాదాపు అందరూ ఐపీఎల్‌ ఆడుతున్న వాళ్లేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.
స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌

చదవండి: T20 World Cup 2021: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ!

మరిన్ని వార్తలు