‘ఈ సారి ఐపీఎల్‌ కప్పు గెలిస్తే.. దానిలో కాఫీ తాగుతా’

31 Mar, 2021 16:42 IST|Sakshi

ముంబై: సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.. ఉండాలి కూడా. అప్పుడే అభిమానులకు, వారికి మధ్య ఉన్న బంధం కొనసాగుతుంది. అయితే నెటిజన్లలో రకరకాల వారు ఉంటారు. తలతిక్క ప్రశ్నలు వేసే వారు కొందరైతే అమాయకమైన ప్రశ్నలు వేసే వారు మరికొందరు. దీనికి తగ్గట్లుగా బదులిస్తుంటారు సెలబ్రిటీలు. ప్రశ్నకు తగ్గట్టుగా తెలివిగా సమాధానం చెప్పే వారి జాబితాలో ముందు వరుసలో ఉంటారు హీరో, కోల్‌కతా నైట్‌ రైడర్స్(కేకేఆర్‌) సహా యజమాని షారుక్‌ ఖాన్‌. ఈ క్రమంలో త్వరలోనే ప్రారంభంకాబోయే ఐపీఎల్‌కు సంబంధించి ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు షారుక్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

ఆ వివరాలు.. తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. ఈ క్రమంలో ఓ యూజర్‌ ‘‘భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా’’ అని ప్రశ్నించాడు. అందుకు షారుక్‌.. ‘‘నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కేకేఆర్‌ కప్పు గెలవాలని ఆశిస్తున్నాను. నేను ఆ కప్పులో కాఫీ తాగాలని భావిస్తున్నాను’’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు షారుక్‌. బాద్‌ షా సమయస్ఫూర్తికి ఫిదా అయ్యారు నెటిజన్లు. 

మరో తొమ్మిది రోజుల్లో ఐపీఎల్‌ 2021 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక కేకేఆర్‌ టీమ్‌ చివరగా 2014లో ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో వారు గెలుచుకున్న రెండో టైటిల్ ఇది‌. ఆ తర్వాత గౌతమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. ఇక 2018 వేలంలో 7.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దినేష్ కార్తీక్, గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో అడుగుపెట్టి 11వ ఎడిషన్ నుంచి కేకేఆర్‌ బాధ్యతలు స్వీకరించాడు. ఈ టీం 2018 సీజన్‌లో మూడవ స్థానంలో నిలిచింది.. కాని గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్ మధ్యలో కెప్టెన్సీని ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్‌ తలపడనుంది. 

చదవండి: ఐపీఎల్‌ 2021: ఆల్‌రౌండర్లే బలం.. బలహీనత

>
మరిన్ని వార్తలు