IPL 2021: కార్తీక్‌ యాక్షన్‌.. ధావన్‌ రియాక్షన్‌

30 Apr, 2021 19:42 IST|Sakshi
Courtesy : IPL T20. Com

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌, దినేష్‌ కార్తీక్‌ల మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే..ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడో బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త వెలుపలగా విసిరాడు. దాంతో ఆ బంతిని స్వీప్ చేయబోయిన శిఖర్ ధావన్.. బ్యాట్‌కి బంతి తాకకపోవడంతో క్రీజులో కాస్త బ్యాలెన్స్ తప్పాడు. అదే అదునుగా బంతిని అందుకున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రెప్పపాటులో స్టంపౌట్ చేసి.. శిఖర్ ధావన్ వైపు చూస్తూ ఔట్ అంటూ సీరియస్‌గా అరిచాడు. దీంతో ధావన్‌ తనమీదకు సీరియస్‌ అయిన దినేష్‌ను చూస్తూ బ్యాట్‌ను వదిలేసి మోకాళ్లపై కూర్చుండిపోయాడు.

అదే సమయంలో కిందపడిన బెయిల్స్‌ సరిచేయడానికి లెగ్‌ అంపైర్‌ అనిల్‌ కుమార్‌ అక్కడికి వచ్చాడు. అయితే వీరిద్దరి రియాక్షన్‌ చూసిన అంపైర్‌ కొన్ని సెకన్ల పాటు షాక్‌కు గురయ్యాడు. అయితే కాసేపటికే ధావన్‌.. కార్తీక్‌లు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడంతో.. అంపైర్‌కు విషయం అర్థమైంది. వాస్తవానికి కార్తీక్‌ స్టంప్‌ అవుట్‌ చేయడానికి ముందే ధావన్‌ తన కాలును క్రీజులో ఉంచాడు. దీనిని కాస్త సీరియస్‌ ఇష్యూ చేద్దామనే కావాలనే ఇద్దరు రియాక్షన్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అంపైర్‌ కూడా నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ పృథ్వీ షా 40 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని దక్కించుకుంది.  ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్థానంలో... కేకేఆర్‌ ఐదో స్థానంలో నిలిచింది.
చదవండి: 'చహర్‌ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు'

మరిన్ని వార్తలు