'పంత్‌ కూల్‌గా ఉండడం మాకు కలిసొచ్చింది'

11 Apr, 2021 17:52 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌/ బీసీసీఐ

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో శనివారం సీఎస్‌కేతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి మూల కారణం ఆ జట్టు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీఎస్‌కే విధించిన 189 పరుగుల భారీ లక్ష్యానికి ఏ మాత్రం భయపడకుండా ఈ జోడి ఆద్యంతం దూకుడుగా ఆడడంతో జట్టు సునాయాన విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్‌ అనంతరం శిఖర్‌ ధావన్‌ స్పందిస్తూ ఈ విజయంలో మాతో పాటు పంత్‌ కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చాడు.

''నిజానికి మీరు అభినందించాల్సింది మా యంగ్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను.. మొదట టాస్‌ గెలవగానే అతను బౌలింగ్‌ ఎంచుకోవడంతోనే మేము సగం విజయం సాధించాం. ఎందుకంటే ముంబై పిచ్‌ సెకండ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అదే మేము రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడడానికి తోడ్పాటునందించింది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. అయ్యర్‌ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పంత్‌కు కోపం ఎక్కువని .. జట్టును ఎలా నడిపిస్తాడో అనే సందేహం ఉంది. కానీ సీఎస్‌కేతో మ్యాచ్‌లో కెప్టెన్‌ హోదాలో పంత్‌ నడుచుకున్న తీరు చాలా హుందాగా అనిపించింది. అనవసర అంశాల జోలికి పోకుండా కూల్‌గా కెప్టెన్సీ నడిపించాడు. మేము ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆటగాళ్లలో తన మోటివేషనల్‌ స్పీచ్‌తో ఉత్సాహాన్ని నింపాడు. ఒక కెప్టెన్‌కు ఉండే లక్షణాలు పంత్‌లో ఉన్నాయి. ఒక సీనియర్‌ ఆటగాడిగా నేను పంత్‌తో పాటు మిగతా ఆటగాళ్లు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచిన సలహాలు ఇచ్చాను. కానీ పంత్‌ మాత్రం మ్యాచ్‌ ఆద్యంతం దూకుడు ప్రదర్శించకుండా నెమ్మదైన మనసత్త్వంతో నడుచుకొని టీంను ఉత్సాహంగా ముందుకు నడిపాడు. ఇక నేను ఈ సీజన్‌ను ఒక మంచి ఇన్నింగ్స్‌తో ఆరంభించడం ఆనందంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ అనుభవం నాకు బాగా పనికొచ్చింది. నా సహచర ఓపెనర్‌ పృథ్వీ షాతో నాకు మంచి జోడి కుదిరింది. రానున్న మ్యాచ్‌ల్లో కూడా దీనిని ఇలాగే కంటిన్యూ అయ్యేలా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా 54, అలీ 36, సామ్‌ కరన్‌ 34 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు ధావన్‌ 85, పృథ్వీ షా 72 పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 15న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

చదవండి: ఆఫ్‌ స్పిన్‌ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా!

'మా సీక్రెట్‌ అదే.. అందుకే స్థిరంగా ఉన్నాం'

మరిన్ని వార్తలు