ఇండియాకు బయలుదేరే ముందు కుటుంబంతో గడిపిన సన్‌రైజర్స్ కెప్టెన్‌

30 Mar, 2021 18:58 IST|Sakshi

హైదరాబాద్‌: ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పాల్గొనేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ స్వదేశం నుండి బయలుదేరాడు. వార్నర్‌.. ఈ సీజన్‌ తొలి విడత మ్యాచ్‌లకు దూరమవుతాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, లీగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరానని ఆయన గుడ్‌న్యూస్‌ చెప్పడంతో సన్‌రైజర్స్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్‌ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి విందును ఆరగించి ఎంజాయ్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 

A post shared by David Warner (@davidwarner31)

కాగా, క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లందరూ ఒక్కొక్కరుగా తమతమ జట్లతో చేరుతున్నారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. చెన్నై వేదికగా జరిగే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.
చదవండి: డక్‌వర్త్‌ కన్‌ఫ్యూజన్‌: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా

మరిన్ని వార్తలు