IPL 2021: మంచిగా ఆడుతున్నం అనుకుంటే.. ఇదేందిరా!

4 May, 2021 14:25 IST|Sakshi
Photos Courtesy: IPL

న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌-2021 ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. పలువురు క్రికెటర్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో క్రికెట్‌ ప్రేమికులు కాస్త నిరాశకు గురైనా, సోషల్‌ మీడియాలో మీమ్స్‌, సెటైరికల్‌ పోస్టులతో హల్‌చల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఒక్క సీజన్‌లోనూ విజేత కాలేకపోయినా ఆర్సీబీ జట్టుకు ఇది భారీ దెబ్బ అని చెప్తున్నారు. తాజా సీజన్‌లో ఆర్సీబీ విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి సేన.. ఐదింటిలో గెలుపొందింది. ఇదే జోరును కొనసాగిస్తే కనీసం ఈసారైనా టైటిల్‌ గెలిచే అవకాశం ఉండేదని, కానీ అంతలోనే ఇలా టోర్నీ రద్దు కావడం నిజంగా దురదృష్టకరమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. రద్దు విషయం తెలియగానే.. ‘‘ఓర్నీ.. మంచిగా ఆడుతున్నం అనుకుంటే.. గిదేందిరా.. గిట్లయిపాయె’’ అన్నట్లుగా విరాట్‌ కోహ్లి ఇలా నోరెళ్లబెడతాంటూ కొందరు మీమ్స్‌ క్రియేట్‌ చేయగా, మరికొందరు డేవిడ్‌ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ తుదిజట్టులోకి తీసుకోనందు వల్లే ఇలా జరిగిందంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా, ఎస్‌ఆర్‌హెచ్‌ వైఫల్యం నేపథ్యంలో.. ఐపీఎల్‌ రద్దవ్వడం వల్ల అత్యంత సంతోషపడే వ్యక్తి కావ్య మారన్‌(సన్‌రైజర్స్‌ సీఈఓ) అని జోకులు పేలుస్తున్నారు. ఇంకొందరేమో... క్రికెటర్ల క్షేమం దృష్ట్యా బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని, టోర్నీ నిర్వహణకయ్యే ఖర్చును కోవిడ్‌పై పోరాటానికి ఉపయోగించాలంటూ సలహాలు ఇస్తున్నారు.

చదవండి: IPL 2021: 14వ సీజన్‌ రద్దు: బీసీసీఐ

ఐపీఎల్‌-2021 రద్దు నేపథ్యంలో వైరల్‌ అవుతున్న మీమ్స్‌పై లుక్కేయండి.


 

మరిన్ని వార్తలు