రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!

22 Apr, 2021 14:06 IST|Sakshi
Photo Courtesy: Twitter

ముంబై: సీఎస్‌కే-కేకేఆర్‌ల మధ్య నిన్న(బుధవారం)జరిగిన మ్యాచ్‌ ఈ సీజన్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ల్లో ఒకటి.  ఇందులో సీఎస్‌కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్‌ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్‌ కావడం మరొకటి. ఆ ఐదు బంతులు కేకేఆర్‌ ఆడి ఉండే ఆ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉండేది ఊహించడం కష్టమే. 20 ఓవర్‌ తొలి బంతిని ఆడిన కమిన్స్‌ స్టైకింగ్‌ తీసుకోవాలనే ఉద్దేశంతో రెండో పరుగు కోసం పరుగెట్టాడు. ఆ క్రమంలోనే ప్రసీద్ధ్‌ కృష్ణ రనౌట్‌ కావడంతో కేకేఆర్‌ కథ ముగిసింది. ఈ మ్యాచ్‌ చూసిన ఆ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. 

పవర్‌ప్లే ముగిసేసరికి ఐదు  వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ ఇక్కడి వరకూ వచ్చిందంటే ఆండ్రీ రసెల్‌(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(40; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్‌(66 నాటౌట్‌; 34 బంతుల్లో 4 పోర్లు, 6 సిక్సర్లు)లు మాత్రమే. ఇందులో రసెల్‌, కమిన్స్‌లు ఆడిన ఇన్నింగ్స్‌ సీఎస్‌కేకు దడపుట్టించింది. రసెల్‌ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు.  గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్‌ తీయకుండా అలానే మ్యాచ్‌ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్‌ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది..

కీలక సమయంలో అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది.  రసెల్‌ను  కెమెరాలు క్యాప్చుర్‌ చేయడం, అది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ రసెల్‌ అలా చూస్తే బాధేస్తుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘ రసెల్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు అమోఘం’ అని  ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘  ప్రతీ క్రికెట్‌ లవర్‌ నిన్ను ఇలా చూసిన తర్వాత బాధపడకుండా ఉండడు’ అని స్పందించాడు. ‘ క్రికెట్‌ అనేది ఒక గేమ్‌.. దాన్ని తేలిగ్గా తీసుకోవాలి’ అని మరొక అభిమాని ట్వీట్‌ చేయగా,  ‘రసెల్‌ బంగారం  లాంటి మనసు కల్గిన మనిషి’ అని స్పందించారు. రసెల్‌ మెట్లపై అలానే కూర్చొండి పోయిన ఫోటోను షేర్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇక్కడ చదవండి: అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్‌
IPL 2021: ఇదేం నో బాల్‌ సైరన్‌.. క్రికెటర్ల అసహనం!

మరిన్ని వార్తలు