IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్‌ వాయిదా!

3 May, 2021 12:30 IST|Sakshi
Photo Courtesy: IPL Twitter

న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలింది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. కాగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్‌లోకి వెళ్లింది.

ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్‌ఐతో వ్యాఖ్యానించారు. కాగా భారత్‌లో రోజువారీ కరోనా కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్‌లో ఉండలేక లీగ్‌ నుంచి వైదొలిగారు. ఇక అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్‌ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

చదవండి: వార్నర్‌ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా
పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌: రాహుల్‌ ఔట్‌!

మరిన్ని వార్తలు