Virat Kohli: అప్పటి వరకు ఆర్సీబీలోనే ఉంటా.. అదే నాకు ముఖ్యం

12 Oct, 2021 08:32 IST|Sakshi
Photo Courtesy: IPL Twitter

ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం

క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించిన మోర్గాన్‌ బృందం

బంతితో, బ్యాట్‌తో అదరగొట్టిన సునిల్‌ నరైన్‌

కప్‌ గెలవకుండానే కెప్టెన్‌గా ముగిసిన కోహ్లి కథ

ఓటమిపై కోహ్లి స్పందన

Virat Kohli Comments On Loss Against KKR: ‘‘మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అదే మ్యాచ్‌ గమనాన్ని మార్చివేసింది. వారు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. వికెట్లు పడగొట్టారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. ఇది నాణ్యమైన బౌలింగ్‌కు సంబంధించిన విజయం. మేం చెత్తగా బ్యాటింగ్‌ చేశామని చెప్పలేం. కచ్చితంగా వాళ్లు విజయానికి అర్హులే. తదుపరి రౌండ్‌కు వెళ్లే అర్హత వారికుందని నిరూపించారు. ఆ ఓవర్‌(క్రిస్టియాన్‌ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు) మమ్మల్ని విజయానికి దూరం చేసిందని చెప్పవచ్చు.

చివరి వరకు మేము శక్తిమేర పోరాడాము. ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. మేం కనీసం మరో 15 పరుగులు చేసినా, ఆ రెండు ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసినా ఇంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చేది కాదు’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి అనంతరం ఈ మేరకు స్పందించాడు. ‘‘సునిల్‌ నరైన్‌ మేటి బౌలర్‌. ఈరోజు మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. షకీబ్‌, వరుణ్‌, నరైన్‌ మాపై ఒత్తిడి పెంచి.. మా బ్యాటర్లపై పైచేయి సాధించారు’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లను ప్రశంసించాడు.

కాగా ఈ పరాజయంతో ఆర్సీబీ ఈసారి కూడా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనే ఇంటిబాట పట్టడంతో టైటిల్‌ గెలవాలన్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు పలకాలనుకున్న కోహ్లికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి.. వారు స్వేచ్ఛగా ఆడగలిగేలా చేశాను. టీమిండియా సారథిగా కూడా ఇదే పని చేశాను. నా బెస్ట్‌ ఇచ్చాను. ఇక ఆర్సీబీ ఫ్రాంఛైజీ కోసం వందకు 120 శాతం బెస్ట్‌ ఇచ్చేందుకు కృషి చేశాను. ఇప్పుడు ఆటగాడిగా కూడా అదే స్థాయిలో కష్టపడతాను.

కచ్చితంగా.. ఆర్సీబీలోనే ఉంటాను. వేరే జట్టులో ఆడటాన్ని నేను అస్సలు ఊహించలేను. ఇతర సంతోషాల కంటే... విశ్వాసపాత్రుడిగా ఉండటమే నాకు ముఖ్యం. నేను ఐపీఎల్‌ ఆడినంత వరకు.. ఈ టోర్నీలో నా చివరి రోజు వరకు ఆర్సీబీలోనే ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. కాగా ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి.. 140 మ్యాచ్‌లలో 66 గెలిచాడు. 70 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. నాలుగింటిలో ఫలితం తేలలేదు. సారథిగా 2016లో ఆర్సీబీని ఫైనల్‌ చేర్చిన కోహ్లి.. ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయాడు.

చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం

మరిన్ని వార్తలు