వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌..

7 Apr, 2021 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో.. తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్‌ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడుతుందని ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సంస్థ వెల్లడించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ పేర్కొంది. కోహ్లి తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. 

మరో రెండు రోజుల్లో 14వ ఐపీఎల్‌ ఎడిషన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో.. కోహ్లిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వివో ప్రస్తుతం ఐపీఎల్‌ అఫిషియల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లి సారధ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. 
చదవండి: రోహిత్‌ 'ఆరే'యడం ఖాయం..

>
మరిన్ని వార్తలు