RCB vs CSK: వసీం ట్వీట్‌.. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం!

24 Sep, 2021 16:53 IST|Sakshi

IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాన జట్ల మధ్య సిరీస్‌ల సందర్భంగా అతడు చేసే పోస్టులకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. తుదిజట్టులోని ఆటగాళ్లు లేదంటే, ఆయా మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌, బౌలర్ల మధ్య జరిగే ఆసక్తికరపోరు అంటూ అతడు చేసే పజిల్‌ తరహా ట్వీట్లను చాలా మంది నెటిజన్లు ఇష్టపడతారు. ఇక ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య యూఏఈ వేదికగా మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో.. ‘‘నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఈ ఇద్దరి ఫైట్‌ మనం చూడబోతున్నాం’’ అన్న అర్థంలో వసీం జాఫర్‌ రెండు ఫొటోలు షేర్‌ చేశాడు. అందులో ఒకటి.. అమెరికన్‌ డాలర్‌ నోటు కాగా.. మరొకటి ప్రసిద్ధ సినిమా.. ‘‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’’లోనిది. ఇక ట్వీట్‌ను డీకోడ్‌ చేసిన నెటిజన్లు తమ ఆన్సర్లతో సిద్ధమైపోయారు. అయితే మెజారిటీ మంది.. నేటి మ్యాచ్‌(సెప్టెంబరు 24)లో ఏబీ డివిల్లియర్స్(ఆర్సీబీ), శార్దూల్‌ ఠాకూర్‌(సీఎస్‌కే) మధ్య ఫైట్‌ ఖాయం అని వసీం చెప్పినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఇందుకు కారణమేమిటంటే..  అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డాలర్‌ నోటుకు ప్రతిగా.. అబ్రహం బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ డివిల్లియర్స్‌ పేరును సూచిస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రాణించిన శార్దూల్‌ ఠాకూర్‌ను ‘లార్డ్‌’ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తిన నేపథ్యంలో.. సెకండ్‌ ఫొటోకు ప్రతిగా శార్దూల్‌ పేరును పేర్కొంటున్నారు. మరికొంత మంది డాలర్‌ నోటుకు హర్షల్‌ పటేల్‌ పేరును సూచిస్తున్నారు. మరికొందరేమో మీరు చెప్పిన ఈ ఇద్దరూ కచ్చితంగా తుదిజట్టులో ఉంటారో లేదో చూద్దాం అంటూ ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఠాకూర్‌ అత్యధిక వికెట్లు(8 వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం విదితమే.

చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు