చప్పట్లు సరిపోవు.. ఘనంగా సత్కరించండి

26 Apr, 2021 21:00 IST|Sakshi

అహ్మదాబాద్‌: కరోనా మహ్మారి కారణంగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ క్రికెటర్‌.. కేకేఆర్‌ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ తనవంతు సాయంగా పీఎం కేర్‌ఫండ్‌కు 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. అంతేకాదు మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో  ఆక్సిజన్‌ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలోకమిన్స్‌  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కమిన్స్‌ చేసిన పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కమిన్స్‌ను అభినందిస్తూ వినూత్న రీతిలో ట్వీట్‌ చేశాడు.


''కమిన్స్‌ నువ్వు సూపర్‌.. కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మా దేశానికి నీ వంతు సాయం చేసి నీ గౌరవాన్ని మరింత పెంచుకున్నావు. కేవలం చప్పట్లు ఒక్కటి చాలవు.. కేకేఆర్‌ రైడర్స్‌.. కమిన్స్‌ను ఘనంగా సత్కరించండి..'' అంటూ కామెంట్‌ చేశాడు. కాగా కమిన్స్‌ గతేడాది సీజన్‌ నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్‌ వేలంలో కమిన్స్‌ను రూ. 16 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి 82 పరుగలతో పాటు 4 వికెట్లు తీశాడు. ఇక సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల జడివాన సృష్టించిన కమిన్స్‌ ఒకదశలో కేకేఆర్‌ను విజయంవైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో కమిన్స్‌ కేవ‌లం 34 బంతుల్లోనే క‌మిన్స్ 66 ప‌రుగులతో విధ్వంసం సృష్టించాడు.  అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలర్లు నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ.. పంజాబ్‌ను ఒత్తిడిలో పడేశారు. ఇప్పటివరకు పంజాబ్‌ 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.
చదవండి: కరోనా: పాట్‌ కమిన్స్‌ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన

మరిన్ని వార్తలు