ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్‌కే ఫ్యాన్స్‌

24 Aug, 2021 17:06 IST|Sakshi

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌-2021) సెకెండ్‌ లెగ్‌ మ్యాచ్‌ల కోసం కొద్ది రోజుల కిందటే దుబాయ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ధోనీ, రైనా, అంబ‌టి రాయుడు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ధోనీ, రైనా అయితే నెట్స్‌లో భారీ షాట్లు ఆడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బంతి పడడమే ఆలస్యం.. వీర బాదుడు బాదుతూ.. మాంచి జోష్‌లో కనిపించారు. వీరి నెట్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

ఇందులో ధోనీ, రైనా బాధుడును చూసి సీఎస్‌కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్‌ మలిదశ మ్యాచ్‌ల్లో తమ స్టార్లకు పట్టపగ్గాలుండవని కాలర్‌ ఎగరేస్తున్నారు. కాగా, సెప్టెంబ‌ర్ 19న చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజ‌న్‌లో చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ల్లో ధోనీ, రైనా పెద్ద‌గా రాణించింది లేదు. దీంతో ఈ ఇద్ద‌రు స్టార్‌ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. మరోవైపు ఫారిన్‌ ప్లేయర్‌, ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ జట్టుతో చేరడం సీఎస్‌కేలో నయా జోష్ వచ్చింది. 
చదవండి: తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్‌ క్రికెట్‌ చీఫ్‌గా ఫజ్‌లీ

మరిన్ని వార్తలు