మీరు కావాల్సినంత నవ్వుకోండి.. నాకేంటి?: పొలార్డ్‌

25 Apr, 2021 00:05 IST|Sakshi

చెన్నై: ముంబై ఇండియన్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కీరోన్‌ పొలార్డ్‌ బౌలర్‌ బంతిని విసరకముందే లైన్‌ దాటి ముందుకు వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు  దారి తీసింది. పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌ వేసే క్రమంలో ఓ బంతికి పొలార్డ్‌ ఇలా చేశాడు. బౌలర్‌ షమీని చూస్తూనే క్రీజ్‌ను ముందుగా వీడాడు. దీనిపై ట్వీటర్‌లో విమర్శల వర్షం కురిసింది. మాజీ క్రికెటర్లు కూడా పొలార్డ్‌ తీరును తప్పుబట్టారు.

కాగా, దీనిపై పొలార్డ్‌ కాస్త విభిన్నంగా స్పందించాడు. దీన్ని చూసి  మీరు కావాల్సినంత నవ్వుకోండి.. నాకేంటి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇటువంటి వాటిని తాను పట్టించుకోనని, అసలు గుర్తించనని, అందుచేత పెద్దగా రియాక్ట్‌ కానంటూ పోస్ట్‌ చేశాడు. మళ్లీ ఈ తరహా జడ్జ్‌మెంట్‌ ఇచ్చే వారిని ప్రేమిస్తానంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. 

2019 ఐపీఎల్‌ సీజన్‌లో అప్పటి కింగ్స్‌ పంజాబ్‌( పంజాబ్‌ కింగ్స్‌) బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరిది తప్పు..  ఎవరిది ఒప్పు అనే కోణంలో సుదీర్గమైన చర్చలు నడిచాయి. ఆ తర్వాత మన్కడింగ్‌ చేయడం ఐపీఎల్‌లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా బ్యాట్స్‌మన్‌ పదే పదే క్రీజ్‌ దాటుతుండటంతో మన్కడింగ్‌ సబబే అనే వాదన వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు