IPL 2022 Auction:షేక్‌ రషీద్‌ సహా ఏడుగురు అండర్‌-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్‌!

8 Feb, 2022 12:52 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఆడాలన్న కలతో ఉన్న భారత అండర్‌-19 కుర్రాళ్లకు గట్టిషాక్‌ తగిలింది. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన యంగ్‌ ఇండియాలోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ మెగావేలానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన ఆంధ్ర కుర్రాడు.. వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ సహా మరో ఏడుగురు లిస్ట్‌లో ఉన్నారు. వయసు, ఇతర కారణాల రిత్యా వీరందరు వేలంలో పాల్గొనే అవకాశం లేనట్లు తెలిసింది.  

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. 
►ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటే.. కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన అనుభవం ఉండాలి.
►ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో కూడా భాగం కాలేడు. 
►అంతేకాదు వేలంలో పాల్గొనడానికి ఆటగాడి వయస్సు కూడా 19 సంవత్సరాలు ఉండాలి. ఇది ఇప్పుడు 8 మంది ఆటగాళ్లకు పెద్ద అవరోదంగా మారింది.  

చదవండి: Mohammed Siraj: 'క్రికెట్‌ వదిలేయ్‌.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో'

కాగా అండర్19 ప్రపంచ విజేత భారత జట్టు నుంచి కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్,  వికెట్ కీపర్ దినేష్ బానా,  ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్‌లు ఐపీఎల్‌ మెగావేలం ఫైనల్‌ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కెప్టన్‌ యశ్‌ ధుల్‌ మినహా ఏ ఒక్క ఆటగాడి వయసు కనీసం 19 సంవత్సరాలు నిండలేదు. అంతేకాదు ఈ ఎనిమిది మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా దేశవాలీ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో యష్‌ ధుల్‌ ఒక్కడే వేలంలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ ఎనిమిది ఆటగాళ్లు దేశవాలీ టోర్నీలు ఆడకపోవడానికి పరోక్షంగా బీసీసీఐ కారణం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో దేశవాలీలో మేజర్‌ టోర్నీలు ఎక్కువగా జరగలేదు. రెండేళ్లపాటు నిర్వహించని రంజీ ట్రోఫీని కూడా ఈ ఏడాదే నిర్వహించనున్నారు. 

అయితే ఈ ఆటగాళ్లు ఆడతారా లేదా అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 228 క్యాప్డ్, 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!

మరిన్ని వార్తలు