IPL 2022 Auction: ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ.. వేలంలో భారీ ధర ఖాయం!

12 Jan, 2022 17:21 IST|Sakshi
PC: Twitter

IPL 2022 Auction: ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో పునరాగమనం చేయనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. మెగా వేలం-2022లో పాల్గొనేందుకు స్టార్క్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమతున్నట్లు సమాచారం. కాగా చివరిసారిగా 2015లో ఐపీఎల్‌లో ఆడాడు స్టార్క్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పనిభారం తగ్గించుకునే క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాడు.

ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు స్టార్క్‌ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ... ‘‘పేపర్‌వర్క్‌ పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటివరకైతే నా పేరు నమోదు చేసుకోలేదు. పోటీలో మాత్రం ఉంటాననే భావిస్తున్నా. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌-2022లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్‌ జట్లు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ బెంగళూరులో మెగా వేలం నిర్వహించనుంది. ఇక స్టార్క్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. నాలుగో టెస్టుల్లో కలిపి ఇప్పటి వరకు 14 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ స్టార్క్‌ గనుక వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయం. ఈ క్రమంలో పెద్ద మొత్తమే చెల్లించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2014, 15 సీజన్లలో ఆడిన స్టార్క్‌ 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..

మరిన్ని వార్తలు