IPL 2022 Auction: అప్పుడేమో 15.5 కోట్లు.. వేలంలో పాల్గొంటానన్న ఆసీస్‌ కెప్టెన్‌.. భారీ ధర ఖాయం!

18 Jan, 2022 12:13 IST|Sakshi
PC: Cricket Australia

యాషెస్‌ సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించి అద్భుత విజయం అందుకున్నాడు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి 4-0 తేడాతో ట్రోఫీని గెలవడంలో సారథిగానూ, బౌలర్‌గానూ తన వంతు పాత్ర పోషించాడు. టెస్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తర్వాత చిరస్మరణీయ విజయం అందించి ఈ సిరీస్‌ను మరింత మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ స్టార్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌ మెగా వేలానికి సన్నద్ధమవుతున్నాడు.

 ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం-2022లో పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియాతో కమిన్స్‌ మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం నేను ఐపీఎల్‌ మెగా వేలంలో ఉండాలని అనుకుంటున్నా. అయితే.. ఆక్షన్‌కు ఇంకా సమయం ఉంది. కాబట్టి నేను పునరాలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఐపీఎల్‌ ఆడటం కోసం ప్రణాళికలు రచించుకుంటున్నా. ఈ విషయంలో నేను ఎవరి సలహాలు, సూచనలు స్వీకరించడం లేదు.

పని భారాన్ని తగ్గించుకోవాలని కూడా భావిస్తున్నా. కాబట్టి ఐపీఎల్‌ వేలం ముందు రోజు వరకు ఏం జరుగుతుందో చెప్పలేము’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన హోబర్ట్‌ టెస్టులో 7 వికెట్లు పడగొట్టి కమిన్స్‌ సత్తా చాటాడు. ఐపీఎల్‌ విషయానికొస్తే... 37 మ్యాచ్‌లు ఆడిన అతడు... 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేకేఆర్‌ తరఫున అతడు ఆడాడు.  కోల్‌కతా ఫ్రాంఛైజీ కమిన్స్‌ను 2020 సీజన్‌కు గానూ 15.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు అతడు మెగా వేలంలోకి రావడానికి నిర్ణయించుకున్న తరుణంలో తాజా ఫామ్‌ దృష్ట్యా భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

చదవండి: IPL 2022: శ్రేయస్‌కు షాక్‌.. హార్ధిక్‌ సహా మరో ఇద్దరిని ఎంచుకున్న అహ్మదాబాద్‌

మరిన్ని వార్తలు