IPL 2022: టోక్యో ఒలింపిక్స్‌ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ

26 Mar, 2022 16:20 IST|Sakshi

BCCI To Felicitate Tokyo Olympics Medallists: వరుసగా నాలుగో ఏడాది ప్రారంభ వేడుకలు లేకుండానే క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) షురూ కానుంది. అయితే, ఈసారి ఓపెనింగ్‌ సెర్మనీ స్థానంలో టోక్యో ఒలింపిక్స్‌ 2020 పతక విజేతలను (భారత) ఘనంగా సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయమై ఇదివరకే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలు పంపింది. 

జావెలిన్ త్రో  స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్లు బజరంగ్ పూనియా (కాంస్యం), రవి దాహియా (రజతం), వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (రజతం), బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (కాంస్యం), షట్లర్‌ పీవీ సింధు (కాంస్యం), భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు (కాంస్యం) ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది​.


మార్చి 26న ముంబైలోని వాంఖడేలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 2022 ఆరంభ మ్యాచ్‌కు ముందు  టోక్యో ఒలింపిక్స్‌ విజేతల సన్మాన కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎందుకు లేవంటే.. 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు నిర్విరామంగా జరిగిన ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు 2019 సీజన్‌లో బ్రేక్‌ పడింది. ఆ ఏడాది భారత సైనికులపై ఉగ్రదాడి (పూల్వామా మారణకాండ) జరిగిన కారణంగా ఐపీఎల్ వేడుకలు రద్దు చేశారు. ఇక 2020, 2021 సీజన్లలో కరోనా కారణంగా ఓపెనింగ్‌ సెర్మనీ ఊసే లేదు.  
చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్‌ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..!

మరిన్ని వార్తలు