IPL 2022: పరుగు తేడాతో శతకం చేజార్చుకున్న రుతురాజ్.. సచిన్‌ రికార్డు సమం

1 May, 2022 22:32 IST|Sakshi

CSK VS SRH: పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న సమరంలో సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకున్న రుతురాజ్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో రెండోసారి శతకం చేసే సువర్ణావకాశాన్ని పరుగు తేడాతో మిస్‌ చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో డెవాన్‌ కాన్వేతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రుతురాజ్‌.. తొలి వికెట్‌కు 182 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2020 సీజన్‌లో వాట్సన్‌, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 181 పరుగులు జోడించగా, తాజాగా రుతురాజ్‌.. కాన్వేతో కలిసి వాట్సన్‌, డుప్లెసిస్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇదే మ్యాచ్‌లో రుతురాజ్‌ మరో రికార్డును సమం చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా సచిన్ సరసన నిలిచాడు.

సచిన్ 31 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకోగా, రుతురాజ్ కూడా సరిగ్గా 31 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన రికార్డు షాన్‌ మార్ష్‌ పేరిట ఉంది. షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 
చదవండి: 
రెండో స్థానానికి ఎగబాకిన లక్నో.. ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగులు

మరిన్ని వార్తలు