IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..!

26 Mar, 2022 12:55 IST|Sakshi

Rajasthan Royals: ఐపీఎల్‌ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, శుక్రవారం జరిగిన ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు శివాలెత్తారు. టీమ్‌ పింక్‌, టీమ్‌ బ్లూ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ పింక్‌.. పడిక్కల్‌ (51 బంతుల్లో 67), రియాన్‌ పరాగ్‌ (27 బంతుల్లో 49 నాటౌట్‌) చెలరేగి బ్యాటింగ్‌ చేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.


అనంతరం ఛేదనలో షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (37 బంతుల్లో 70 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ, అతనికి మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో టీమ్‌ బ్లూ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టులో కొత్తగా చేరిన పడిక్కల్‌, హెట్‌మైర్‌, చహల్‌ (2/30) రాణించడంతో ఆర్‌ఆర్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. 

మెగా వేలంలో ఆర్‌ఆర్‌ యాజమాన్యం హెట్‌మైర్‌ను రూ. 8 కోట్ల 50 లక్షలకు, దేవదత్‌ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు, చహల్‌ను రూ. 6.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌ నేటి (మార్చి 26) నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో తాజా ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. 
చదవండి: IPL 2022 Auction: ప్రసిధ్‌ కృష్ణకు జాక్‌పాట్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌కు వెళ్లిన ఆటగాళ్లు

>
మరిన్ని వార్తలు