CSK VS KKR: లేటు వయసులో లేటెస్ట్‌ రికార్డు నెలకొల్పిన ధోని

27 Mar, 2022 13:12 IST|Sakshi

MS Dhoni: గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఎట్టకేలకు 2022 ఐపీఎల్‌ సీజన్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేకేఆర్‌తో జరిగిన 15వ ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌లో (మార్చి 26) హాఫ్ సెంచరీ కొట్టిన ధోని, లేటు వయసులో ఓ లేటెస్ట్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో చివరిసారిగా 2019 సీజన్‌లో ఆర్‌సీబీపై  హాఫ్‌ సెంచరీ (48 బంతుల్లో 84) చేసిన ధోని.. శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

తద్వారా ఐపీఎల్‌లో 24వ అర్ధ సెంచరీ నమోదు చేయడంతో పాటు మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అతి పెద్ద వయసులో (40 ఏళ్ల 262 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ (40 ఏళ్ల 116 రోజులు), సచిన్‌ టెండూల్కర్‌ (39 ఏళ్ల 362 రోజులు) రికార్డులను అధిగమించాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సీఎస్‌కే తరఫున తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగిన ధోని (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50 నాటౌట్‌) ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కేకేఆర్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్‌ తరఫున రహానే ( 34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్‌‌ ) టాప్‌ స్కోరర్‌గా నిలువగా, 2 వికెట్లతో రాణించిన ఉమేశ్‌ యాదవ్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.
చదవండి: ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు

మరిన్ని వార్తలు