IPL 2022 Final: అతడిని తుది జట్టు నుంచి తప్పించండి.. అప్పుడే: టీమిండియా మాజీ బ్యాటర్‌

29 May, 2022 12:58 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌(PC: IPL/BCCI)

IPL 2022 Final GT Vs RR: ఐపీఎల్‌-2022 మెగా ఫైనల్‌ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పలు సూచనలు చేశాడు. తుదిజట్టు కూర్పులో మార్పులు చేయాల్సిందిగా సూచించాడు. లాకీ ఫెర్గూసన్‌, సాయి సుదర్శన్‌లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 

ఇక గుజరాత్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ట్రెంట్‌ బౌల్ట్‌ చేతిలో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగాల్సి వస్తుందని ఆకాశ్‌ చోప్రా జోస్యం చెప్పాడు. మాథ్యూ వేడ్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని సూచించాడు.

కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం(మే 29) జరిగే ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఢీకొట్టేందుకు గుజరాత్‌ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో క్రికెట్‌ వ్యాఖ్యాత, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా మ్యాచ్‌ గురించి తన యూట్యూబ్‌ చానెల్‌లో అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఇందులో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ను ఉద్దేశించి.. ‘‘వేడ్‌ స్థానంలో లాకీ ఫెర్గూసన్‌ను తీసుకోవాలి. సాయి కిషోర్‌ స్థానాన్ని సాయి సుదర్శన్‌తో భర్తీ చేయాలి. మథ్యూ వేడ్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ విన్నరే కావొచ్చు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడి బ్యాటింగ్‌ సరిగ్గా లేదు. గత రెండు ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా ఆడాడు. అతడిలో ఆత్మవిశ్వాసం కొరవడింది’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరడంలో వేడ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే,11 ఏళ్ల తాజా సీజన్‌తో ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన వేడ్‌..9 ఇన్నింగ్స్‌లో 149 పరుగులు మాత్రమే చేశాడు. 

అదే విధంగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, డేవిడ్‌ మిల్లర్‌ ఫామ్‌లో ఉండటం కలిసి వస్తుందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. తెవాటియా కూడా అవసరమైన సమయంలో జట్టుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. రషీద్‌ ఖాన్‌ విశ్వరూపం చూపిస్తే గుజరాత్‌ విజయావకాశాలు మెరుగుపడతాయన్న ఆకాశ్‌.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌ ఝులిపించకపోతే మాత్రం గుజరాత్‌ టైటిల్‌ గెలిచే అవకాశాలకు గండి పడుతుందని అభిప్రాయపడ్డాడు. 

చదవండి 👇
IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేత, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
GT Vs RR: ఆ జట్టు గెలవాలని మనసు కోరుకుంటోంది.. కానీ విజేత ఎవరంటే: అక్తర్‌

మరిన్ని వార్తలు