Trolls On GT IPL 2022 Win: 'ఊహించిందే జరిగింది.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గట్రా.. ఏమి లేవుగా?!'

30 May, 2022 13:32 IST|Sakshi
PC: IPL Twitter

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కొత్తేం కాదు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం రేపింది. రాజస్తాన్‌ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు సహా ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్లు సహా పలువురు వ్యక్తులు అరెస్టవడం సంచలనం కలిగించింది. ఈ ఉదంతం ఐపీఎల్‌ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఒక రకంగా ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ అని చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌లో నాటుకుపోయేలా చేసింది. ఎంత ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్‌కున్న క్రేజ్‌ 15 ఏళ్లలో ఇసుమంతైనా తగ్గలేదు.


PC: IPL Twitter
తాజాగా ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చాంపియన్స్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్‌లో టైటిల్‌ కొట్టి గుజరాత్‌ టైటాన్స్‌ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్‌ సేన కప్‌ కొట్టడంపై సోషల్‌ మీడియాలో కొన్ని ట్రోల్స్‌, మీమ్స్‌ వైరల్‌గా మారాయి. గుజరాత్‌ టైటాన్స్‌ నిజాయితీగా కప్ కొట్టుంటే సమస్య లేదు గానీ.. ఒకవేళ ఫిక్సింగ్‌ గట్రా ఏమైనా ఉంటే మాత్రం చర్చించాల్సిన విషయమే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.


PC: IPL Twitter
సోషల్‌ మీడియాలో ఈ ట్రోల్స్‌ రావడం వెనుక ఒక కారణం ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ.. బీసీసీఐ సెక్రటరీ జై షా దగ్గరి వ్యక్తులకు చెందింది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక జై షా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు కూడా కావడం.. తొలిసారి ఒక ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్‌లో బరిలోకి దిగడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రధాని మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పేరుతో ఒక ఫ్రాంచైజీ బరిలోకి దిగుతుందంటే మాములుగా ఉండదు.


ఎలాగైనా ఆ జట్టే కప్‌ కొట్టాలని ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అందుకే లీగ్‌లో విజయాలతో అప్రతిహాతంగా దూసుకెళ్లిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌, ఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచింది. ఇంకో విషయమేంటంటే.. ఫైనల్‌కు హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా వచ్చారు. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తి వేలాది మంది భద్రత మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు రావడం కూడా ఫిక్సింగ్‌ అనే పదం వినిపించడానికి కారణం అయింది. ఇక దీనికి సంబంధించిన ట్రోల్స్‌, మీమ్స్‌పై ఒక లుక్కేయండి.


మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనే పదం పక్కనబెడితే.. గుజరాత్‌ టైటాన్స్‌ మాత్రం సూపర్‌ అని చెప్పొచ్చు.  సీజన్‌ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్‌.. అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. లీగ్‌ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్‌రౌండర్‌ అనేది మరోసారి రుచి చూపించాడు.అటు కెప్టెన్‌గా రాణించడంతో పాటు.. ముందు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్‌లో 34 పరుగులు చేసిన పాండ్యా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

చదవండి: గుజరాత్‌ టైటాన్స్‌ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే

'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'

మరిన్ని వార్తలు