IPL 2022: ‘‘అవును.. అతడిని తీసుకున్నాం’’.. కొత్త ఫ్రాంఛైజీ మెంటార్‌గా గౌతీ

18 Dec, 2021 15:55 IST|Sakshi

IPL 2022- Lucknow: ఐపీఎల్‌-2022 సీజన్‌తో రెండు కొత్త ఫ్రాంఛైజీలు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్‌ పేరిట టీమ్‌ల రాకతో వచ్చే సీజన్‌ నుంచి పది జట్లు పోటీపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మెగా వేలం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా... కొత్త ఫ్రాంఛైజీలు కోచ్‌లు, మెంటార్లను నియమించుకునే పనిలో పడ్డాయి. సంజీవ్‌ గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో ఇప్పటికే జింబాబ్వే మాజీ సారథి ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది.

ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఓపెనర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంజీవ్‌ గోయెంక క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘అవును.. మేము అతడి(గంభీర్‌)ని నియమించుకున్నాం. క్రికెటర్‌గా అతడు ఎన్నో రికార్డులు సాధించాడు. అతడి పట్ల నాకెంతో గౌరవం ఉంది. తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ’’ అని పేర్కొన్నారు. ఇక గంభీర్‌ ఈ విషయం గురించి చెబుతూ... ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్‌పీఎస్‌జీ గ్రూపు, డాక్టర్‌ గోయెంకాకు ధన్యవాదాలు.

పోటీ ఏదైనా సరే... విజేతగా నిలవాలనే కసి నాలో అలాగే ఉంది.  పూర్తి నిబద్ధతతో నా విధిని నిర్వర్తిస్తా’’అని చెప్పుకొచ్చాడు. కాగా సంజీవ్‌ గోయెంక, గంభీర్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లు అందించిన గంభీర్‌.. ఆ తర్వాత ఢిల్లీకి సారథ్యం వహించాడు. ఈ లీగ్‌లో తన పేరిట పలు రికార్డులు నమోదు చేశాడు.
 

మరిన్ని వార్తలు