IPL 2022- RCB: ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేస్తున్నాడు!

31 Mar, 2022 11:11 IST|Sakshi
ఆర్సీబీ జట్టు(PC: IPL/BCCI)

Good News For RCB: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వీలైనంత త్వరగా భారత్‌కు రానున్నాడు. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఆర్సీబీతో కలవనున్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు. కాగా మాక్సీ ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను అతడు మార్చి 18న పెళ్లాడాడు.

ఆ తర్వాత వినీ కుటుంబ ఆచారం ప్రకారం తమిళ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను మనువాడాడు. తమ జీవితంలోని ఈ ముఖ్య ఘట్టం నేపథ్యంలో ఐపీఎల్‌ ఆరంభం మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఇక వివాహానంతర వేడుకలు ముగిసిన అనంతరం మాక్సీ భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో తన పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లకు సంబంధించిన ఫొటోలను మాక్స్‌వెల్‌ షేర్‌ చేశాడు.

సతీమణి వినీతో కలిసి ఇండియాకు వస్తున్నట్లు హింట్‌ ఇచ్చాడు ఈ ‘తమిళనాడు అల్లుడు’. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మాక్సీ రాకతో ఆర్సీబీ మరింత బలం పుంజుకోనుంది. ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన డుప్లెసిస్‌ బృందం.. బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి బోణీ కొట్టింది. ఏప్రిల్‌ 5న రాజస్తాన్‌ రాయల్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.

చదవండి: IPL: క్రిస్‌ గేల్‌ వచ్చేస్తున్నాడు..! 

మరిన్ని వార్తలు