Mathew Wade: 'మా జట్టు ఫైనల్‌ చేరింది.. అయినా సరే టోర్నమెంట్‌ చికాకు కలిగిస్తుంది'

28 May, 2022 14:28 IST|Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ వ్యక్తిగతంగా తన బ్యాటింగ్‌ చాలా చిరాకు కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ 2022లో తన అరంగేట్రం సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న గుజరాత్‌ టైటిల్‌ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. మే 29(ఆదివారం) రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ అమితుమీ తేల్చుకోనుంది.

ఈ నేపథ్యంలో మాథ్యూ వేడ్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా డాట్‌కామ్‌కు ఇంటర్యూ‍్వ ఇచ్చాడు.'' ఐపీఎల్‌ 2022 సీజన్‌.. వ్యక్తిగతంగా టోర్నమెంట్‌ మొత్తం నాకు చికాకు తెప్పించింది. బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికి వాటిని భారీగా మలచలేకపోతున్నా. రాజస్తాన్‌ రాయల్స్‌తో కీలకమైన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసే వరకు నాది చెత్త బ్యాటింగ్‌ లాగానే కనిపించింది. టి20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్‌ చేయడం ఆనందం కలిగించింది. ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్‌ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్‌ నుంచి నాకు మంచి సపోర్ట్‌ ఉంది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది. రషీద్‌ ఖాన్‌ రూపంలో ఏడో నెంబర్‌ వరకు విధ్వంసకర బ్యాటింగ్‌ మాకు ఉండడం అదృష్టం. ఇక ఈసారి కప్‌ గుజరాత్‌దే. అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మాథ్యూ వేడ్‌ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్‌)కు మాథ్యూ వేడ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆకట్టుకోని వేడ్‌.. చివరగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో మాత్రం 35 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో వేడ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.  

మరిన్ని వార్తలు