IPL 2022: ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌

21 Oct, 2021 17:59 IST|Sakshi

Manchester United Owners Interested To Bid For Two IPL New Franchises: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్‌బాల్‌ క్లబ్‌లలో ఒకటైన మాంచెస్టర్‌ యునైటెడ్‌.. కొత్త ఐపీఎల్‌ జట్లలో ఒక దాన్ని కొనుగోలు చేసేందు​కు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్లబ్‌ యాజమాన్యమైన గ్లేజర్‌ కుటుంబం టెండర్‌ పత్రాలు సైతం కొనుగోలు చేసిందని సమాచారం. 


టెండర్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 20తో ముగినప్పటికీ.. సదరు క్లబ్‌ కోసం బీసీసీఐ చివరి తేదీని సైతం పొడిగించిందని క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మాంచెస్టర్‌ క్లబ్‌ కొత్త ఐపీఎల్‌ జట్టును చేజిక్కించుకుంటే.. డబ్బుతో పాటు ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని బీసీసీఐ భావిస్తుంది. కాగా, స్టార్‌ ఫుట్‌బాలర్‌, పోర్చుగల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 


ఇదిలా ఉంటే కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్‌పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ వంటి దేశీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొన వచ్చని బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఐపీఎల్‌ కొత్త జట్ల కొనుగోలు రేసులో నిలిచినట్లు తెలుస్తోంది.   

చదవండి: సండే బిగ్‌ మ్యాచ్‌.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి!

మరిన్ని వార్తలు