Shimron Hetmyer: 'నా టైం వృథా చేస్తున్నావు.. దయచేసి పిజ్జా, బర్గర్‌ తిననివ్వు'

14 Apr, 2022 18:35 IST|Sakshi
Courtesy: IPL Twitter

వెస్టిండీస్‌ క్రికెటర్లు సాధారణంగానే ఫన్నీ మూడ్‌లో ఉంటారు. వారు ఏం చేసినా మనకు కామెడీగానే అనిపిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రావో, ఆండ్రీ రసెల్‌, కీరన్‌ పొలార్డ్‌ లాంటి ఆటగాళ్లను చూస్తున్నాం. ఐపీఎల్‌ పుణ్యమా అని వాళ్లు మరింత దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో షిమ్రోన్‌ హెట్‌మైర్‌, జాసన్‌ హోల్డర్‌, ఓడియన్‌ స్మిత్‌ సహా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌కు సుపరిచితులుగా మారిపోయారు.

ఈ నేపథ్యంలో హార్డ్‌హిట్టర్‌ హెట్‌మైర్‌ గురించి టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో హెట్‌మైర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్నాడు. 2020, 2021 సీజన్లలో హెట్‌మైర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అదే సమయంలో కైఫ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఒక సందర్భంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను కైఫ్‌ తాజాగా పంచుకున్నాడు.

''హెట్‌మైర్‌ రేపటి గురించి ఏ మాత్రం ఆలోచించడు. ఎప్పుడు రిలాక్స్‌ మోడ్‌లో ఉంటాడు.  జాలీగా ఉంటూ ఎక్కువ సమయం గడిపేస్తాడు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనేదానిపై బ్యాట్స్‌మన్‌ కసరత్తులు చేయడం చూస్తుంటాం. కానీ హెట్‌మైర్‌ ఆ కోవకు చెందినవాడు కాదు. అలాంటి విషయాలు అసలు పట్టించుకోడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఎలా ఎదుర్కొంటావు అని అడిగాను. దానికి హెట్‌మైర్‌.. ''అసలు వరుణ్‌ ఎవరు? నా సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నావు.. నన్ను పిజ్జా, బర్గర్‌లు తిననివ్వు'' అని సమాధానమిచ్చాడు. అయితే మ్యాచ్‌లో హెట్‌మైర్‌ వరుణ్‌ చక్రవర్తిని సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. తనపై తనకు మంచి కాన్ఫిడెన్స్‌ ఉన్న ఆటగాడు హెట్‌మైర్‌. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సీజన్‌లో హెట్‌మైర్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఫినిషర్‌గా వస్తున్న హెట్‌మైర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు కలిపి 168 పరుగులు సాధించాడు. ముఖ్యంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే 59 పరుగులతో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

చదవండి: FIFA WC Vs IPL 2022: షాకింగ్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్‌

మరిన్ని వార్తలు