RR Vs LSG: లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్‌.. ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగు

16 May, 2022 06:07 IST|Sakshi

ముంబై: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మొదట రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సామ్సన్‌ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేసి ఓడింది.

సూపర్‌ జెయింట్స్‌ను ఆరంభంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్‌ (2/18) దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో డికాక్‌ (7), ఆయుశ్‌ బదోని (0)లను పెవిలియన్‌ చేర్చాడు. కేఎల్‌ రాహుల్‌ (10)ను అవుట్‌ చేసిన ప్రసిధ్‌ కృష్ణ జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు. తర్వాత దీపక్‌ హుడా (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కని పోరాటం చేశాడు. కానీ కొండంతలా పెరిగిన రన్‌రేట్‌కు తగిన ప్రదర్శన చేయడంలో కృనాల్‌ పాండ్యా (25), స్టొయినిస్‌ (27), హోల్డర్‌ (1) విఫలమవడంతో సూపర్‌ జెయింట్స్‌కు ఓటమి తప్పలేదు.

మళ్లీ ఓడిన చెన్నై
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్లతో నెగ్గింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని గుజరాత్‌ 19.1 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వృద్ధిమాన్‌ సాహా (57 బంతుల్లో 67 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధశతకం సాధించాడు.

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్‌ X పంజాబ్‌ కింగ్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు