IPL 2022: దినేశ్‌ కా​ర్తీక్‌ దెబ్బకు వణికిపోతున్న రాజస్థాన్‌.. మరోసారి ఎక్కడ విరుచుకుపడతాడోనని..!

26 Apr, 2022 17:25 IST|Sakshi
Photo Courtesy: IPL

RR VS RCB: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 26) మరో రసవత్తర సమరం జరుగనుంది. పూణేలోని ఎంసీఏ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. రాజస్ధాన్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, ఆర్సీబీ.. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. 


సీజన్‌ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికర పోరులో ఆర్సీబీ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో డీకే మెరుపు ఇన్నింగ్స్‌ తాలూకా జ్ఞాపకాలు ఆర్‌ఆర్‌ జట్టును ఇప్పటికీ భయపెడుతున్నట్లున్నాయి. అందుకే నేటి మ్యాచ్‌కు ముందు ఆ జట్టు డీకేని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. 

ముంబై-పూణే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. నువ్వు ఈ మార్గంలో సులువుగా పూణే చేరుకోగలవు అని గోవా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మీదగా పూణే చేరుకోవాలని కార్తీక్‌కు సూచిస్తూ దాని తాలూకా మ్యాప్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ ఆర్సీబీని విజయ పథంలో నడిపిస్తున్న కార్తీక్ నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకూడదనే ఆర్‌ఆర్‌ ఈ ట్వీట్‌ చేసినట్లు ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న డీకే.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 105 సగటున 210 అతి మూల్యమైన పరుగులు చేసి ఆర్సీబీకి అద్భుత విజయాలు అందించిన విషయం విధితమే. 
చదవండి: RCB: మొన్న 68 పరుగులకే ఆలౌట్‌.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..!

మరిన్ని వార్తలు