IPL 2022: బయో బబుల్‌ను వీడిన ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌! కారణం?

10 Apr, 2022 13:26 IST|Sakshi
PC: IPL/BCCI

IPL 2022: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ బయో బబుల్‌ను వీడినట్లు తెలుస్తోంది. అతడి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న క్రమంలో ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం హర్షల్‌కు ఈ విషయం గురించి తెలిసినట్లు ఐపీఎల్‌ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. కాగా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ​ హర్షల్‌ పటేల్‌... స్టార్‌ బౌలర్‌గా ఎదిగాడు.

గత సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ ఆడిన అతడు అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. అయితే, హర్షల్‌ను రిటైన్‌ చేసుకోని బెంగళూరు.. వేలంలో ఇతర జట్లతో పోటీ మరీ అతడిని సొంతం చేసుకుంది. 10.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న హర్షల్‌ ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు.

ఇక ముంబైతో శనివారం నాటి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హర్షల్‌ కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా హర్షల్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న హర్షల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే కుటుంబాన్ని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు.. ‘‘దురదృష్టవశాత్తూ హర్షల్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అందుకే అతడు బయో బబుల్‌ను వీడాల్సి వచ్చింది. అయితే, చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్‌ 12 నాటి మ్యాచ్‌ కంటే ముందే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది’’ అని ఐపీఎల్‌ వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

చదవండి: IPL 2022: అతడు భవిష్యత్‌ ఆశా కిరణం: డుప్లెసిస్‌ ప్రశంసలు

మరిన్ని వార్తలు