IPL 2022: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. అచ్చిరాని జెర్సీతో బ‌రిలో దిగ‌నున్న‌ ఆర్సీబీ 

7 May, 2022 18:27 IST|Sakshi

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుతోంది. 14 సీజన్‌లుగా కలగా మిగిలిపోయిన ఐపీఎల్‌ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతుంది.

కాగా, ప్ర‌తి ఏటా ఓ మ్యాచ్‌లో రెగ్యులర్ జెర్సీ (ఎరుపు రంగు) కాకుండా కొత్త జెర్సీలో కనిపించే ఆర్సీబీ ఈ సీజ‌న్‌లోనూ ఆ సంప్రదాయ‌న్ని కొన‌సాగించ‌నుంది. ఆదివారం (మే 8) మధ్యాహ్నం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీల్లో క‌నిపించనున్నారు. గతేడాది కరోనా వారియ‌ర్స్‌కు మ‌ద్ద‌తుగా బ్లూ క‌ల‌ర్ జెర్సీ ధరించిన ఆర్సీబియ‌న్లు.. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గో గ్రీన్’ నినాదంతో గ్రీన్ క‌ల‌ర్ జెర్సీల‌ను ధ‌రించ‌నున్నారు. 

అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ క‌ల‌ర్‌ జెర్సీ పెద్దగా కలిసి రాలేదు. ఈ రంగు జెర్సీలో ఆ జ‌ట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓట‌మిపాల‌వ్వ‌గా.. రెండు మ్యాచ్‌ల్లో (2011, 2016) విజ‌యాలు, మ‌రో మ్యాచ్ (2015) వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఆర్సీబీ 2021లో బ్లూ జెర్సీతో బరిలో దిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.
చ‌ద‌వండి: IPL 2022: అదే జ‌రిగితే కోహ్లి రికార్డుకు మూడిన‌ట్లే..!

 

మరిన్ని వార్తలు