IPL 2022 RR Vs RCB: ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్‌ పరాగ్‌..

27 Apr, 2022 07:52 IST|Sakshi
Courtesy: IPL Twitter

మంగళవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ వన్‌మ్యాన్‌ షో చేశాడు. గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్‌ తరఫున 37 మ్యాచ్‌లు ఆడినా... 387 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన పరాగ్‌ ఎట్టకేలకు చక్కటి షాట్లతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 32 పరుగుల వద్ద హసరంగ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్‌ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణించిన పరాగ్‌ 4 క్యాచ్‌లు కూడా అందుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడం విశేషం.

ఈ నేపథ్యంలోనే రియాన్‌ పరాగ్‌ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్‌లు తీసుకున్న మూడో ప్లేయర్‌గా పరాగ్‌ నిలిచాడు‌. గతంలో కలిస్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; డెక్కన్‌ చార్జర్స్‌పై 2011లో), గిల్‌క్రిస్ట్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌; చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 2012లో) ఈ ఘనత సాధించారు.    

కాగా ఇదే మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌తో పరాగ్‌ గొడవ చర్చనీయాంశంగా మారింది. హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో పరాగ్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌తో మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కాగా ఆఖరి బంతికి ప‌రాగ్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్ర‌మంలో రియాన్ ప‌రాగ్, హ‌ర్షల్ ప‌టేల్‌కి మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌రిగింది. రాజ‌స్తాన్ ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసి పెవిలియ‌న్‌కు వెళ్తున్న‌ ప‌రాగ్‌.. హ‌ర్షల్ ప‌టేల్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. అది విన్నహ‌ర్షల్ ప‌టేల్ పైపైకి వ‌చ్చాడు. వెంట‌నే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ సహాయక సిబ్బందిలో ఒక‌రు జోక్యం చేసుకుని గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

చదవండి:  రియాన్‌ పరాగ్‌ వన్‌మ్యాన్‌ షో.. రాజస్తాన్‌ ‘రాయల్‌’గా గెలిచింది

మరిన్ని వార్తలు