IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే..?

5 Mar, 2022 18:39 IST|Sakshi

ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానుల‌కు శుభవార్త. ఐపీఎల్‌ 15వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ రేపు (మార్చి 6) ప్ర‌క‌టించనుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ మీడియా సంస్థకు వెల్లడించారు. అయితే బీసీసీఐ రేపు లీగ్‌ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తుందని, ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ను త‌ర్వాత వెల్ల‌డిస్తుంద‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు. 

కాగా, మార్చి 26 నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జ‌ర‌గుతాయ‌ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ప్లేఆఫ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

మరోవైపు స్టేడియాల్లోకి అనుమతించబోయే ప్రేక్ష‌కుల‌ సంఖ్యను కూడా పెంచాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ సంఖ్య 50 శాతం వ‌ర‌కు ఉండవచ్చని సమాచారం. ఇక లీగ్‌ క్వారంటైన్ నిబంధ‌న‌ల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన విధంగా భారత ఆటగాళ్లకు 3 రోజులు, విదేశీ ప్లేయర్లకు 5 రోజులు కాకుండా గ‌డువు త‌గ్గించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తుంది.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్‌

మరిన్ని వార్తలు