IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ దూరం! అయితే..

15 Mar, 2022 13:09 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌ జట్టు(PC: IPL)

IPL 2022- Mumbai Indians: ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో టీమిండియాకు దూరమైన ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంకా కోలుకోనట్లు సమాచారం. క్యాష్‌ రిచ్‌లీగ్‌ తాజా సీజన్‌లో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం.

కాగా గత కొన్నేళ్లుగా సూర్యకుమార్‌ ముంబై జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా రూ. 8 కోట్లు వెచ్చించి ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిటైన్‌ చేసుకుంది. 

ఇదిలా ఉండగా.. టీమిండియా మిడిలార్డర్‌లో స్థానం సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్‌ వెస్టిండీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్‌ కోసం ప్రాక్టీసు​ చేస్తున్న సమయంలో అతడి చేయి ఫ్రాక్చర్‌ అయింది. దీంతో జట్టుకు దూరమైన సూర్య.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. 

అయితే, 31 ఏళ్ల సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈ క్రమంలో ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఏప్రిల్‌ నాటి రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌తో అతడు జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తదితర ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం ముంబై జట్టుతో చేరారు.

చదవండి: Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు